దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి (1897 – 1980)

8448154380_0a0fe64ded_z

దేవులపల్లి కృష్ణ శాస్త్రి కవిత్వం గురించి వ్రాయటం అంటే తెలుగు వాడిగా జన్మించినందుకు నాకు నేనుగా చేసుకునే సన్మానం. వర్షం వచ్చే ముందు వీచే చల్లగాలి తెమ్మెర తనువును తాకితే ఎంత హాయిగా వుంటుందో కృష్ణ శాస్త్రి పాట చెవులకు అంత మధురం. సంక్రాంతి పండుగకు శుద్దమైన నేతితో  వండిన  అరిశ నోటిలో కరిగేటప్పుడు కలిగే ఆనందమే కృష్ణ శాస్త్రి పాట. లోకం తెలియని తెలుగు పిల్ల నిర్మలత్వం కృష్ణ శాస్త్రి పాట. తెలియకుండానే హృదయం లోకి జొరబడే ప్రేయసి కృష్ణ శాస్త్రి పాట.

భావ కవిత్వానికి సినిమా పాటల్లో ఒక శాశ్వత స్థానాన్ని కలిగించిన కృష్ణ శాస్ర్తి గురించి చెప్పాలంటే ఓ అక్షర యజ్ఞమే అవుతుంది. ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 35 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితాలో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు అతి కొద్ది మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు …దేవులపల్లి కృష్ణశాస్త్రి.

రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన కృష్ణశాస్ర్తి, ఈ పద నిర్దేశకుల్లోనూ తక్కువ పాటలు రాసిన కవి. అయితే గొప్ప  కవితా విలువలు కలిగిన కృష్ణ శాస్త్రి పాటలు   తెలుగుదనం తేనెలూరుతూ తెలుగు తల్లి మెడలో  నిరంతరం పరిమళం వెదజల్లే వాడని పారిజాత పుష్ప మాల. ఒక్కొక్క పాట ఆయన హృదయ ఆవిష్కరణా  అనిపిస్తుంది. 1929 లో విశ్వకవి రవీంద్రునితో ఏర్పడిన పరిచయమే ఆయనను భావ కవిత్వం వైపు మరలేటట్లు చేసింది అని చెబుతారు

స్వతహాగా సినీ పాటల రచయత కాదు కృష్ణ శాస్త్రి. భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి, బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి (1951)’ తో చిత్రరంగంలో అడుగుపెట్టారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం – కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. కృష్ణశాస్ర్తి అంటే కవితల పాలవెల్లి. సుమధుర లాలిత్య పదాల పాటల బంగారు మూట కృష్ణ శాస్త్రి.
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు కృష్ణ శాస్త్రి. చందమామలో చల్లదనాన్ని, హృదయంలో ఆర్ధ్రతని, పుష్పం లోని తేనెను రంగరించి పాట వ్రాస్తే అది కృష్ణ శాస్త్రి పాట. పట్టు పరికిణి లో వొదిగిన పదహారణాల తెలుగుబాల  వయ్యారం కృష్ణ శాస్త్రి పాట. ఉషోదయపు మంచు తెమ్మర కృష్ణ శాస్త్రి పాట. కవిత, పాట, నాటిక కలబోసుకున్న త్రిమూర్తి -దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి. ఆయన తెలుగు పదం- నేలకానితే కందిపోయే పసి పాదం. ఆయన తెలుగు పద్యం- అమ్మమ్మ చేతుల్లోని నేతి నైవేద్యం.

కృష్ణ శాస్త్రి పాట అంటే ఆయన  మాటల పాటలతోనే కూర్చిన ఈ గజ మాల. 

మావిచిగురు తిన్న కోయిల తీయగా పాడే పాట!

ఆకులో ఆకుగా , పువ్వులో పువ్వుగా ఒదిగి పోవాలనుకునే ప్రకృతి మమేకం

ప్రతి రాత్రిలోనూ వసంత రాత్రిని   చూసే శృంగా రం

ఆకాశం లో హాయిగా విహరించే మేఘం ద్వారా  పంపే  ప్రేయసీ ప్రియుల సందేశం

తెలుగు ఆడపడుచు జీవితంలో కార్తీక దీపం

కన్నె పిల్ల  అరచేత ఎర్రగా పండిన గోరింటాకు

మామిడి చిగురు లోని ఎరుపు, మంకెన పువ్వులోని ఎరుపు, మాణిక్యం లోని ఎరుపు

మనస్సు నిలుపోలేక కుశలమా  అంటూ అడిగే క్షేమ సమాచారం

నిదుర రాని నిశి రాత్రుల్లో, నోరు లేని ఆవేదనల్లో తోడుగా నిలిచేది

అడుగడుగునా, అందరిలోనూ గుడి ఉందంటూ దైవానికి చెప్పే నిర్వచనం

అప్సరసలు పేరంటా ళ్ళుగా, దేవతలు పురోహితులుగా, నక్షత్రాలు తెచ్చే తలంబ్రాలతో ఆకాశ పందిరిలో జరిగే పెళ్లి

హరి పూజకు సమర్పించే పువ్వు

రావమ్మా మహాలక్ష్మీ అంటూ పిలిచే హరిదాసు పిలుపు

కన్నెపిల్ల చెదిరే ముంగురులు, కాటుకలు , నుదురంతా పాకేటి కుంకుమలు 

అందీ అందని సత్యాలేమో అనిపించే సుమధుర స్వప్నాలు

తేట నీటి ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట ఆ పాట

కోవెల గంటల గణ గణ, గోదావరి తరగల గలగల

మనసున ఊగే మల్లెల మాల

చక్కర మాటల మూట చిక్కని తేనెల ఊట

దేవులపల్లి ఎప్పుడూ  మీగడ తరక లాంటి తెల్లని బట్టలు ధరించేవారు. నిత్యం చెరగని చిరు ధరహాసం ఆయన అలంకారం. ఆయన పాటల్లగానే  ఆయన ప్రవర్తన పారదర్శకంగా, నిజాయితీ మరియు  ప్రేమ నిండుకుని ఉండేది.  మనం గత సంచిక లో కేవలం ఆయనను ఓ సినీ కవి గానే చూసాం. సినిమాలు ఆయన జీవితంలోకి ఆలశ్యం గా ప్రవేశించాయి, బి.ఎన్. రెడ్డి గారి ప్రోత్సాహంతో. కేవలం 170 పాటలే రచించినా ఒక్కొక్క పాట ఓ ఆణిముత్యం. ఒక్కొక్కపాట ఓ కవితా ఝురి. ఎందుకంటే సాహిత్యం ఆయనకు జన్మ తో సిద్ధించిన వరం. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో1897 నవంబరు 1న జన్మించాడు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్టి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం గార్లు ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు.పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.

తన చుట్టూ వున్నవిషయ వాసనలకు, కష్టాలకు, కడగండ్లకు, సంతోషాలకు స్పందించి వ్రాసేవాడే నిజమైన కవి. అలా తన్మయత్వంతో  అనుభవించి వ్రాసేదే పది కాలాలు నిలబడే కవిత్వం. ఎందుకంటే ఓ కవి  సామాజిక అంతర్భాగం. సమాజంతో వేరుగా జీవించే కవి లేదా రచయత నిజాయతీతో కూడిన రచనలు అందించలేడు. సమాజం కూడా అలాంటి రచనలు ఆస్వాదించలేడు. సగటు మనిషి ఆలోచనల ప్రతిబింబమే నిజమైన రచన.  ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదేసమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు.

భావ కవులు అనేకమంది ఉండొచ్చు కానీ భావ కవిత్వమంటే కృష్ణ శాస్త్రి…. కృష్ణ శాస్త్రి అంటే భావ కవిత్వం!   1920లో వైద్యంకోసం రైలులో బెజవాడ నుండి బళ్ళారి వెళుతూండగా ప్రకృతి కాంత నింపిన పులకరింత “కృష్ణ పక్షం” కావ్యంగా రూపు దాల్చింది.  ఆకులో ఆకునై పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై, ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?” అంటూ కలవరించి పరవశించాడు కృష్ణ శాస్త్రి. “ఎన్నడో మీరు పాడిన దీ వసంత మధుర జీవనగీతి! హేమంత దీర్ఘ యామినీ మధ్యవేళయే యైన, నేడుకూడ, నా యెద, త్రుళ్ళింత లాడుచుండు; నవ్య భాగీరథీ దివ్యనది విధాన,నేడు కూడ సోత్సవ నృత్య మాడు లోన”  అంటూ సుమధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు తన్మయత్వం తో. నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? నా యిచ్చయే గాక నాకేటి వెరపు ? కాలవిహంగమ పక్షముల దేలియాడి తారకా మణులలో తారనై మెరసి మాయమయ్యెదను నా మధురగానమున! నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?” అంటూ తిరుగుబాటూ చేసాడు కృష్ణ శాస్త్రి  తన “కృష్ణ పక్షం” లో.

1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది. తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు.

1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. ఆయన రచనలు మరింత భావుకతను సంతరించుకున్నాయి. కృష్ణ శాస్త్రి తన సామాజిక బంధాన్ని మరింత బలోపేతం చేసాడు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు.

సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే 1929లో  “ఊర్వశికావ్యం వ్రాశాడు. ఊర్వశి ఒక పద్య కృతుల సంపుటి. పద్యాల్లో కళావంతుల జీవితాలను ప్రతిబింబింప చేసాడు కృష్ణ శాస్త్రి. సామజిక ప్రయోజనం లేని కవిత్వం తావి లేని పువ్వే కదా. “ఆ యనాధ బాలిక ప్రియురాలు నాకు! ఆమె నవసాంధ్య సమయ మల్లీ మనోజ్ఞ కుసుమకామిని; ఎదొ వింతకోర్కె తీయదనపు వేదన నా జీవితమున రేపు!” అంటాడు కృష్ణ శాస్త్రి ఊర్వశి లో. 1929 లోనే “ప్రవాసం ” అనే పద్య కృతుల సంపుటిని రచించాడు కృష్ణ శాస్త్రి.  1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో “మల్లీశ్వరి” చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1947లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.

ఓ గొప్ప దేశ భక్తుడు దేవులపల్లి. జన్మ భూమి పై తన అభిమానాన్ని ప్రేమను నేటికీ విఖ్యాతమైన ఓ గీతం ద్వారా “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి! జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి! జయ జయ జయ…..జయ జయ సశ్యామల సుశ్యామల చలచ్చేలాంచల! జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల!జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా! జయ జయ జయ……. జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ! జయ గాయక వైతాళిక గళవిశాల పథవిహరణ! జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ! జయ జయ జయ…..” అంటూ తెలియ చేసాడు. ఈ గీతాన్ని ఆయన కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లక్చరర్ గా పనిచేస్తున్నపుడు వారి విధ్యార్థుల కోసం వ్రాసా డు.

కృష్ణ శాస్త్రి విశిష్ట రచనల్లో ఊర్వశి కావ్యము ,అమృతవీణ – 1992 – గేయమాలిక,అమూల్యాభిప్రాయాలు – వ్యాసావళి,బహుకాల దర్శనం – నాటికలు,కధలు,ధనుర్దాసు – నాలుగు భక్తీ నాటికలు ,కృష్ణశాస్త్రి వ్యాసావళి – 4 భాగాలు,మంగళకాహళి – దేశభక్తి గీతాలు,శర్మిష్ఠ – 6 శ్రవ్య (రేడియో) నాటికలు,శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, నాటిక 1993, మేఘమాల – సినిమా పాటల సంకలనం – 1996, శ్రీ విద్యావతి – శృంగార నాటికలు, యక్షగానాలు – అతిథిశాల – సంగీత రూపకాలు, మహతి, వెండితెర పాటలు – 2008 ఉన్నాయి.

గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని అతని రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలు ప్రశంసలు (1975 – ఆంధ్ర విశ్వవిద్యాలయం – కళాప్రపూర్ణ, 1978 -సాహిత్య అకాడమీ అవార్డు,1976 – పద్మ భూషణ్) లభించాయి. అభ్యుదయ కవిత్వానికి మార్గదర్శియై, ఆధునిక మహా భారతం వంటి మహా ప్రస్థానం రచించిన శ్రీశ్రీ కూడా కృష్ణ శాస్త్రి కవిత్వ ప్రభావానికి గురెైన వాడే! తర్వాత తర్వాత చలం ‘కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానిది, ప్రపంచపు బాధ శ్రీశ్రీది’ అన్నప్పటికీ ఆయన కవిత్వంలో పదాల అల్లిక, భావచిత్రాలు, ఇమేజినేషన్‌, పదలాలిత్యం పఠితల హృదయాల్లో ముద్రించుకు పోయాయి!

1980 ఫిబ్రవరి 24న దేవులపల్లి వారు కన్ను మూస్తే మహాకవి శ్రీ శ్రీ ‘షెల్లీ మళ్ళీ మరణించాడు’ ‘తెలుగు దేశపు నిలువుటద్దం బ్రద్దలైంది’ ‘వసంతం వాడి పోయింది’ అని అశ్రు తర్పణం చేసారు. ‘అచ్చంగా వసంత మాసం వచ్చే దాక’ ఆగక ‘తొందర పడి కోయిల ముందే కూసింది’ అంతకు పదేళ్ళ క్రితమే ‘రానిక నీ కోసం సఖీ, రాదిక వసంత మాసం’ అనీ. కానీ ఈ భావ గడసరి కోయిలకు తెలుసు, ఎప్పటికీ తను వేసినది చిక్కు ప్రశ్న గానే మిగిలి పోతుందనీ- ‘మావి చిగురు తినగానే కోవిల పలికేనా? కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా?’ అన్నదే ఆ ప్రశ్న. ఆ సమాధానం దొరికేంత వరకూ తనను మరచి పోరనీ ఆయనకు తెలుసు. “ఎన్నడో మీరు పాడిన దీ వసంత మధుర జీవనగీతి! హేమంత దీర్ఘయామినీ మధ్యవేళయే యైన, నేడుకూడ, నా యెద, త్రుళ్ళింత లాడుచుండు” “ఏ మనోహర సీమలం, దే పవిత్ర విమల తేజోమయ విశాల వీథులందు,అక్ష రామోద సంభరి తాంతరంగులగుచు, విహరించుచున్నారొ”.                                                                                  – మురళీ కృష్ణ జీ.

One thought on “దేవులపల్లి వేంకట కృష్ణ శాస్త్రి (1897 – 1980)

Leave a comment